తాండూరు, వెలుగు : కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వికారాబాద్ జిల్లా పోలీసులు గురువారం పట్టుకున్నారు. తాండూరులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి రేపాల శ్రీధర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన యర్రమల్లి గిరిధర్ అనే వ్యాపారి నుంచి తనకు పేస్ట్ సరఫరా అవుతుందని చెప్పాడు. దీంతో పోలీసులు బీదర్లో ఉన్న గిరిధర్ను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరి వద్ద కలిపి మొత్తం 600 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, రవాణాకు ఉపయోగించే వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ స్నేహ మొహ్ర తెలిపారు.
